ప్రభుత్వానికి తలవంచని ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ: లోక్‌సభలో ప్రియాంక గాంధీ

  • లోక్‌సభలో సోదరుడిని గట్టిగా సమర్థించిన ప్రియాంక గాంధీ
  • నెహ్రూను విమర్శించే బీజేపీ నేతలే ఇప్పుడు ఆయన్ను ఉటంకిస్తున్నారని చురక
  • స్పీకర్ ఓం బిర్లా తొలగింపు తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు
లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తన సోదరుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని గట్టిగా సమర్థించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి తలవంచకుండా నిలబడిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆమె కొనియాడారు. మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన చర్చలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు.

సభకు అధ్యక్షత వహిస్తున్న ప్యానెల్ స్పీకర్ కృష్ణ ప్రసాద్ తెన్నేటి అనుమతితో ప్రియాంక మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార పక్షంపై ఆమె చురకలు అంటించారు. "ప్రతిరోజూ నెహ్రూజీని విమర్శించే వారే, ఈ రోజు ఆయనను ఉటంకించడం చూసి నాకు నవ్వొచ్చింది. ఒక్కసారిగా వారికి నెహ్రూజీపై గౌరవం పుట్టుకొచ్చింది. ప్రజాస్వామ్యాన్ని అత్యంత బలోపేతం చేసింది నెహ్రూజీనే అని ఇప్పుడు చెబుతున్నారు" అని ప్రియాంక వ్యాఖ్యానించగా, ప్రతిపక్ష సభ్యులు బల్లలు చరుస్తూ మద్దతు తెలిపారు.

అనంతరం రాహుల్ గాంధీని సమర్థిస్తూ, "గత 12 ఏళ్లుగా ఈ ప్రభుత్వం ముందు తలవంచని వ్యక్తి ఈ దేశంలో ఒక్కరే ఉన్నారు. ఆయనే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఎందుకంటే లోక్‌సభ నాయకుడు నిజం మాట్లాడటానికి వెనుకాడరు. కానీ, వారు (ప్రభుత్వం) నిజాన్ని జీర్ణించుకోలేరు" అని ప్రియాంక అన్నారు.

అంతకుముందు, స్పీకర్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు స్పందించారు. రాజ్యాంగం ప్రకారం చట్టాలు, నిబంధనలకు అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. "ఏ వ్యక్తి అయినా తనను తాను అన్నింటికీ అతీతుడిగా భావించినప్పుడు, అతడిని నిలదీయడం చాలా ముఖ్యం" అని రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.



Rahul Gandhi
Priyanka Gandhi
Lok Sabha
Congress
BJP
Kiren Rijiju
Nehru
Parliament
Indian Politics

More Telugu News